చేపలు వేటకు వెళ్లి కట్టలేరులో ముగ్గురు గల్లంతు
ఎర్రుపాలెం మండల పరిధిలోని కట్టలేరు కు చేపల వేటకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు గల్లంతయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం , మండల పరిధిలోని బంజర గ్రామానికి చెందిన బాధవత్ రాజు( 55) భూక్యా కోటి ( 46) సాయి ( 25) కట్టలేరులో చేపల వేటకు వెళ్లారు. వెళ్ళిన ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం అందుకున్న తహసీల్దార్ ఉషా శారద , మధిర సిఐ మధు , ఎర్రుపాలెం ఎస్సై రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ , పోలీస్ అధికారుల సమాచారంతో ఖమ్మం నుండి ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు మొదలు పెట్టింది. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు , బంజర గ్రామస్తులు పెద్ద ఎత్తున కట్టలేరు వద్దకు చేరుకున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.