ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు ? ... చంద్రబాబు నాయుడు ఉప రాష్ట్రపతి, లోకేశ్ ముఖ్యమంత్రి ?

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్నారని, ఆ తర్వాత ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా అనంతరం, ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి చంద్రబాబు నాయుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ భారతదేశం నుండి ఒక బలమైన నాయకుడిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దక్షిణాదిలో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

చంద్రబాబునే ఎందుకు ఎంపిక చేస్తారు ?

చంద్రబాబు నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత దేశస్థాయిలో ఉపయోగపడతాయని ఎన్డీఏ భావించే అవకాశం వుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి, ముఖ్యంగా నారా లోకేశ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్తే, రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి అనివార్యమవుతుంది. ఈ క్రమంలో నారా లోకేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్న నారా లోకేశ్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజ కవర్గం నుండి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి తన రాజకీయ పట్టును నిరూపించుకున్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి కేంద్రానికి వెళ్తే, లోకేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, యువ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తారని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

అయితే, ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ ఊహాగానాలు నిజమైతే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచి పోతుంది.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు