జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి
- ఎల్.ఐ.జి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు గల అవకాశాలను పరిశీలించాలి
- అధికారులు విచారణ పూర్తి చేసి, వెంటనే ఖమ్మం ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు జరపాలి
- ఈ మేరకు ఖమ్మం జిల్లా డబ్ల్యూజేఐ సమావేశంలో తీర్మానాల ఆమోదం
- ప్రభుత్వం స్పందించని పక్షంలో పోరాటం తప్పదని స్పష్టం చేసిన రాష్ట్ర నేత ఎన్.ఎస్. రావు
- డబ్ల్యూజేఐ సభ్యులకు జాతీయ డిజిటల్ మెంబర్షిప్ కార్డుల అందజేత
ఖమ్మం: దశాబ్దాలకు పైగా గంపెడాశతో ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని
ప్రకటించాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టులకు
ఎల్.ఐ.జి, ఇందిరమ్మ
ఇండ్లు ఇచ్చేందుకు గల అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించింది. ఇక ఏ మాత్రం ఆలస్యం
చేయకుండా ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఖమ్మం ప్రెస్
క్లబ్ పై జరగుతున్న విచారణను తక్షణమే పూర్తి చేసి, ఎన్నికలు నిర్వహించాలని సంబంధిత
జిల్లా అధికార్లకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఖమ్మంలోని ఎన్.ఎస్.పి రామాలయం
ఫంక్షన్ హాల్లో యూనియన్ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఖమ్మం
జిల్లా డబ్ల్యూజేఐ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఆన్
లైన్ మెంబర్షిప్ ఫామ్స్ పూర్తి చేసిన సభ్యులకు డబ్ల్యూజేఐ నేషనల్ కమిటీ జారీ చేసిన
‘డిజిటల్ మెంబర్షిప్
కార్డులు’
అందజేయడంతో పాటు,
సభ్యుల నుండి సభ్యత్వ అంగీకార పత్రాలను స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ‘డబ్ల్యూజేఐ’ మాత్రమే సభ్యులకు అత్యంత
పారదర్శకంగా జాతీయ డిజిటల్ మెంబర్షిప్ కార్డులను అందజేస్తుంది.
అనంతరం సమావేశాన్ని ఉద్ధేశించి డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్. ఎస్ రావు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించక పోవడం విచారకరమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా, ఇంత వరకూ ఈ సమస్య కొలిక్కి రాలేదన్నారు. ఇక ఏ మాత్రం తాత్సారం చేయకుండా తక్షణమే జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే, డబ్ల్యూజేఐ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధనకు అనేక పోరాటాలు సాగించడంతో పాటు పలు జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుందన్నారు. జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్దరించాలని కేంద్ర రైల్యే మంత్రిని కోరినట్లు చెప్పారు. అలాగే, స్టేట్ బస్ పాసులపై అధనంగా విధించిన టోల్ టాక్స్, సెస్ అను తొలగించాలని టీజీ ఆర్టీసీ ఎం.డికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇకపై కూడా జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూజేఐ రాజీలేని పోరాటాలు సాగిస్తుందని ఎన్. ఎస్ రావు స్పష్టం చేశారు.
సమావేశంలో డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కో కన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ మరియు ప్రెస్ క్లబ్ ఇంచార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబ రావు, గోగుల నారాయణ రావు, మోడెపల్లి కిరణ్, ఏనిగండ్ల శ్రీనివాస రావు, బొడ్డుపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు బోడపట్ల సతీష్, పసుపులేటి ఉపేందర్, పొనకంటి ఉపేందర్ రావు కొత్తగా డబ్ల్యూజేఐలో చేరారు.







Comments
Post a Comment