సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి

WJI
  • డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కమిటి సమావేశంలో రాష్ట్ర నేత ఎన్. ఎస్ రావు
  • ఖమ్మం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపాలని కోరుతూ సమావేశంలో తీర్మానం 
  • యూనియన్ ప్రెస్ క్లబ్ వ్యవహారాల ఇంచార్జీగా కె. కళ్యాణ్ చక్రవర్తి నియామకం
WJI

ఖమ్మం: సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డబ్ల్యూజేఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్. ఎస్ రావు) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా సమాజానికి సేవ చేసిన సీనియర్ జర్నలిస్తులు, నేడు బీపీ, షుగర్ టాబ్లెట్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నాయని, అలాగే తెలంగాణలో కూడా జర్నలిస్టులకు పెన్షన్ స్కీంను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఆదివారం ఖమ్మంలో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన జరిగిన జిల్లాకమిటీ సమావేశానికి ఎన్. ఎస్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్ల్యూజేఐ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోందన్నారు. సంఘాన్ని ఖమ్మం జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా నాయకులకు సూచించారు. ఇప్పటికే జర్నలిస్టుల సమస్యలపై స్పందించడంలోనూ, అందుకనుగుణంగా కార్యక్రమాలను రూపొందించడంలోనూ జిల్లా కమిటి ముందుందని ప్రసంశించారు.ముందు ముందు కూడా ఇదే వరవడిని కొనసాగించాలని కోరారు. జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లాలో డబ్ల్యూజేఐ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది జర్నలిస్టులు సంఘంలో చేరేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కాగానే జిల్లా మహాసభలు నిర్వహిస్తామని అన్నారు.

WJI

పలు తీర్మానాల ఆమోదం 

ముందుగా సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, యూనియన్ విస్తరణ, ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం, యూనియన్ తరుపున ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కె. కళ్యాణ్ చక్రవర్తిని ఇంచార్జిగా నియమించారు. అంతే కాకుండా, సాధ్యమైనంత త్వరగా ఖమ్మం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపాలని సంబంధిత జిల్లా అధికార్లను కోరుతూ తీర్మానం చేశారు.అలాగే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు త్వరలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ సమావేశంలో మరో తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కోకన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు గోగుల నారాయణ రావు, కొమ్మినేని ప్రసాద రావు, ఏనిగండ్ల శ్రీనివాస రావు, బొడ్డుపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

జాప్యం లేకుండా అక్రిడేషన్ల జారీ ప్రక్రియను పూర్తి చేయండి

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపికి డబ్ల్యూజేఐ, టీజేఏ నేతల నివాళి