అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణ

Mallu Bhatti Vikramarka

  • మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
  • మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఎన్ని వేల కోట్లయినా ఇస్తాం
  • ప్రజా ప్రభుత్వంలో పట్టణాల్లో ప్రశాంత వాతావరణం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 
( తాళ్లూరి అప్పారావు, మధిర )

అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం మధిరలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగడానికి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరడానికి ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  మున్సిపల్, విద్యా రెండు శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయని ఈ రెండు శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు తీసుకు వెళ్తున్నారని తెలిపారు. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్టీపీలు మంజూరు చేశారని, పట్టణాల్లో ఆసుపత్రులు, విద్యావ్యవస్థ, ఎలక్ట్రిసిటీ ఈ రంగాల్లో ప్రపంచంలో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రతినెలా 15వ తారీకు తర్వాతే వచ్చేవి కానీ మేము అధికారంలోకి రాగానే ప్రతి నెల మొదటి తారీకునే టెన్షనుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉద్యోగ వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.  2047 విజన్ డాక్యుమెంట్ ను ఇటీవల గ్లోబల్ సమ్మిట్ లో విడుదల చేశామని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చామన్నారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన గత ప్రభుత్వం పట్టణాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు అన్ని రంగాలను గాలికి వదిలేసారని ఆరోపించారు. అటువంటి వారికి ఓట్లు వేస్తే సన్న బియ్యం పోయి తిరిగి మొద్దు బియ్యం వస్తాయి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు, ఉద్యోగుల జీతాలు ప్రతినెలా 15వ తారీకు తర్వాతే పడతాయి అన్నారు. 

గతంలో  అధికారంలో ఉన్నవారు పట్టణాల్లో వాళ్లను ఇబ్బందులకు గురి చేశారు శాంతి భద్రతలు లేకుండా పోయాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు జవాబుదారీగా ఉండాలని శాంతియుత వాతావరణం లో పట్టణాలు అభివృద్ధి చెందాలని అధికారులను ఆదేశించాము, అంతటా ప్రశాంత వాతావరణం నెలకు ఉందని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ నగరాలు పట్టణాలన్నిటిలో సాధ్యమైనంత మేరకు మౌలిక సదుపాయాలను, మెరుగైన వసతులు కల్పిస్తూ ముందుకు పోతుందని తెలిపారు. అర్హత కలిగిన పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని, బహిరంగ మార్కెట్లో 55 రూపాయలు కిలో పలికే మేలు రకం బియ్యాన్ని ప్రతి కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున లెక్కగట్టి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. డబ్బులు ఆదా అయితే కుటుంబంలో సభ్యుల అవసరాలు తీరుతాయన్న ఆలోచనతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ప్రతినెల ఆ విధులు చెల్లిస్తుందని వివరించారు. 

వడ్డీ లేని రుణాల కింద రాష్ట్రంలోని మహిళలకు 27 వేల కోట్ల విలువైన చెక్కులను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఎన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్న, ఎన్ని వేల కోట్లయినా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారితో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్ బంకుల నిర్వహణ, కుటీర పరిశ్రమలు పెట్టించడం, బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ రుణాలు ఇప్పించడం వంటి పనులు చేపట్టామన్నారు.  నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాము మహిళల పక్షాన ప్రతి నెల ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు.  ఉత్పత్తి రంగానికి కావలసింది నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు ఇ0దుకు అవసరమైన అన్ని రకాల చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని ఫలితంగా రాష్ట్రంలో కుటుంబ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. 

మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే స్కిల్స్ ఉన్న కోర్సులు నేర్పించాలి అందుకే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఇవన్నీ కార్పొరేషన్లు, మున్సిపల్ కేంద్రాల్లోనే ఉన్నాయని తెలిపారు. 
రాబోయే 50 సంవత్సరాలకు మధిర పట్టణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రాజకీయాలు వద్దు.. అభివృద్ధి మాత్రమే ప్రధానం అన్నారు. వరద నీరు మధిర పట్టణంలోకి రాకుండా భారీ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, వైరా నదినీ టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, ఫుడ్ కోర్ట్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఆధునిక స్మశాన వాటిక, మురుగునీరు కనబడకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భారీ వర్షాలు వరదలు వచ్చిన విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా ఒంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మురుగునీరు, వరద నీరు కలిసి పారకుండా శుద్ధి చేసి బయటకి వదిలేందుకు ఎస్టిపి నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. మధిర పట్టణానికి ప్రవేశించే మార్గాల్లో ఆహ్లాదకర వాతావరణ ఉండేందుకు పార్కులు నిర్మిస్తున్నామని తెలిపారు. మై మధిర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. విలేకరుల సమావేశంలో మధిర మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణగుప్తా పాల్గొన్నారు.

Comments