ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలు విడనాడాలి
- యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగూరు వలి
( తాళ్లూరి అప్పారావు, మధిర )
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, ప్రాంతీయ కార్యాలయ కన్వీనర్ ఏ వినోదరావు లు డిమాండ్ చేశారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయం లో శుక్రవారం జరిగిన యుటిఎఫ్ మధిర మండల ఆఫీస్ బేరర్స్ సమావేశంలో వారు మాట్లాడుతూ 8 వ వేతన సంఘం పేరుతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను కాలరాసే విధంగా నిబంధనలను రూపొందించడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాల ఆలస్యంగా కేంద్రం ఏర్పాటుచేసిన 8 వ వేతన సంఘం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు ప్రతి ఉద్యోగిని, పెన్షనర్ని ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయన్నారు. పెన్షనర్స్ కి పిఆర్సి వర్తింపులో, డి ఏ వర్తింపులో అసంబద్ధ నిబంధనలను రూపొందించారన్నారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపగా,
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి గురించి పట్టించుకోకపోవడం, ఐదు డిఏలు ప్రకటించకపోవడం, సర్వీస్ లో ఉన్న రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల అనేక బిల్లులు పెండింగ్లో ఉంచటం ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు విడనాడి వారి హక్కులను కాపాడే విధంగా నిబంధనలను రూపొందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
నేడు యుటిఎఫ్ మధిర మండలం మహాసభ
టీఎస్ యుటిఎఫ్ మధిర మండల మహాసభ శనివారం స్థానిక టీవీఎం పాఠశాలలో నిర్వహించనున్నట్లు యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు బి నాగరాజు ఈ వీరయ్యలు తెలిపారు. సంఘ నిర్మాణంలో కీలకమైన మండల మహాసభకు ముఖ్య అతిధిగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ హాజరవుతారన్నారు. కార్యదర్శి నివేదిక, విద్యారంగం -తీర్మానాలు, నూతన కమిటీ నిర్మాణం ఎజెండాగా మండల మహాసభ జరుగుతుందన్నారు. ఈ మహాసభకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టి ఎస్ యు టి ఎఫ్ మండల ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, కోశాధికారి బైర్ల చెన్నయ్య, మహ్మద్ రఫి, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ మల్ల రాజు, కార్యదర్శులు జిబిఎంఎస్ రాణి, కూరపాటి రమేష్, షేక్ లాల్ అహ్మద్, వూట్ల కొండలరావు, లంక నాగేశ్వరరావు, బొబ్బిళ్ళ పాటి రమేష్, నిమ్మగడ్డ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment