కాళేశ్వరంపై సీబీఐ విచారణ ... తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు !

Kaleshwaram Project, CBI Enquiry

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలపై సీబీఐ Central Bureau of Investigation ) విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని కొంత కాలంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై జస్టిస్ పి.సి. ఘోష్  ( PC Ghosh ) కమిషన్ కూడా విచారణ జరిపింది. కమిషన్ నివేదికపై శాసన సభలో చర్చించిన అనంతరం, దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కాంగ్రెస్ ( Congress ) పార్టీ అగ్ర నేతలే కేంద్ర కేంద్ర దర్యాప్తు సంస్థలను 'బీజేపీ పెంపుడు చిలుక' అని ఆరోపిస్తున్న తరుణంలోనే కీలకమైన ఈ కేసును అదే సీబీఐకి అప్పగించడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.ఈ నిర్ణయం వెనుక పలు ప్రధానమైన కారణాలు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

నిష్పాక్షిక విచారణకు అవకాశం: ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా విచారణ జరిపితే, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్‌ఎస్  ( BRS ) ఆరోపించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ పాత్ర కూడా ఉన్నందున సీబీఐ విచారణ వల్ల ఒక నిష్పాక్షిక, సమగ్ర విచారణకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావించి ఉండవచ్చు.

బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలహీన పరచడం: సీబీఐ ( CBI ) విచారణతో బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచి, వారిని రాజకీయంగా బలహీనపరచాలనేది మరొక ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణ కన్నా, సీబీఐ జరిపితేనే ప్రజల్లో దానికి ఎక్కువ విశ్వసనీయత ఉంటుందని కాంగ్రెస్ భావించి ఉండొచ్చు.

రాజకీయ లబ్ధి పొందడం: ఈ కేసులో అవకతవకలు నిజమని సీబీఐ దర్యాప్తులో తేలితే, బీఆర్‌ఎస్ పై తాము కావాలని ఆరోపణలు చేయ లేదని, స్వయంగా కేంద్ర దర్యాప్తు సంస్థే నిరూపించిందని ప్రజలకు చూపించి, రాజకీయ లబ్ధి పొందడానికి అవకాశం దొరుకుతుంది.

బీజేపీని కూడా లక్ష్యం చేసుకోవడం: ఒకవేళ సీబీఐ ఈ కేసులో అవినీతిని నిరూపించ లేక పోయినా లేదా కేసును నీరుగార్చిందని భావించినా, అప్పుడు బీజేపీ ( BJP ), బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యారని ఆరోపించి రెండు పార్టీలను టార్గెట్ చేసే అవకాశం కాంగ్రెస్‌కు ఉంటుంది.

ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి కూడా కొంత మేర లాభం చేకూర్చవచ్చని కొందరు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలహీన పరచాలనే బీజేపీ వ్యూహానికి ఇది పరోక్షంగా తోడ్పడుతుంది. బీఆర్‌ఎస్ పార్టీకి ఈ కేసు వల్ల నష్టం జరిగితే, ఆ స్థానాన్ని కొంత వరకు ఆక్రమించే అవకాశం బీజేపీకి దొరుకుతుంది. ఏదేమైనా, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ తెలంగాణ రాజకీయాలను ఒక కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చడంలో కీలక పాత్ర పోషించనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి