ఈ నెల 22 న గ్రామాల్లో పనుల జాతర
ఖమ్మం జిల్లాలో ఈ నెల 22న పనుల జాతర- జరగనుంది. ఒకే రోజు 20 మండలాల
పరిధిలోని 571 గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు
పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
కమీషనర్ ఆదేశాల మేరకు ఈ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే పనుల జాతరకు అవసరమైన
అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ జాతరలో
భాగంగా ఉపాధి హామీ పథకం, ఆర్.డబ్ల్యూ.యస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛ భారత్ వంటి
విభాగాల్లో చేపట్టిన, చేపట్టనున్న
పనులను చేపడతారు. అలాగే, నూతన గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్
(గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్సులు, ఇందిరా మహిళా శక్తి – ఉపాధి భరోసా క్రింద
వ్యక్తిగత ఆస్తుల కల్పన, పశువుల కొట్టాలు, కోళ్ళ, గొర్రెల షెడ్లు, పండ్ల తోటలు, వాన పాముల ఎరువుల
తయారీ,
అజోలా
పిట్ నిర్మాణాలు, జలనిధి
క్రింద వాన నీటి సంరక్షణ, -భూగర్భ జలాలు పెంచే ఫారమ్ పాండ్స్, ఊట కుంటలు వంటి పనులను
చేపడతారు. అంతే కాకుండా, ఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పని చేసిన కూలీలు, దివ్యాంగులు, పారిశుధ్య కార్మికులు, హరిత సంరక్షకులను ఈ సందర్భంగా
సన్మానిస్తారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల
అధికార్లతో పాటు ఐదు నియోజక వర్గాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
Comments
Post a Comment