భద్రాద్రి రాముని సాక్షిగా ... ఈ నెల 21న ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశం : మంత్రి పొంగులేటి
- సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ళు ప్రారంభం
- లక్ష మందితో ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవం
- బెండలం పాడులో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి
భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని
ప్రారంభించి, అదే
నేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుపు కోవడం
ఒక చారిత్రక ఘట్టమని తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అన్నారు. సోమవారం ఆయన ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలోని
బెండలం పాడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ళను
పరిశీలించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై అధికార్లతో సమీక్ష
జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బెండలం పాడు గ్రామానికి మొత్తం
312 ఇండ్లు మంజూరు కాగా, వాటిలో 72 ఇండ్లు పూర్తయ్యాయని, వాటిలో 27 ఇండ్లకు ఇప్పుడు ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహ ప్రవేశం జరుగుతుందన్నారు. ఈ గృహ ప్రవేశ
మహోత్సవానికి సుమారు ఒక లక్ష మంది ప్రజలు హాజరవుతారని తెలిపారు. గడిచిన పదేళ్ళలో పేద
వాడి సొంత ఇంటి కల కలగానే మిగిలి పోయిందన్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు
అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించి, మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా
నాలుగున్నర లక్షల ఇళ్ళు మంజూరు చేశామన్నారు. పేద వాడి చిరకాల వాంఛను ఈ పేదోడి ఇందిరమ్మ
ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. గతంలో ఏ పేద వాడికీ అందని ఇళ్ళను ఇప్పుడు ఈ
ప్రభుత్వం పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందిస్తోందని
చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2.5 లక్షల ఇళ్ళు నిర్మాణం వివిధ దశల్లో
వుందన్నారు. మిగిలిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా అర్హులైన వారిని
ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్
జితేష్ వి పాటిల్, ఎస్పీ
రోహిత్ రాజు , అశ్వారావుపేట
శాసన సభ్యులు జారే ఆదినారాయణ, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసన సభ్యులు
తెల్లం వెంకట్రావు, ఇల్లందు
శాసన సభ్యులు కోరం కనకయ్య, వైరా శాసన సభ్యులు రామదాస్ నాయక్, సత్తుపల్లి
శాసనసభ్యులు మట్ట రాగమయి తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment