బీసీ రిజర్వేషన్ల పెంపులో ... ఎవరిది దొంగాట ?

BC reservation

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు  ఈ వ్యవహారం కాస్త కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరుగా మారింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలను కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, అది ముస్లింల రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ పన్నిన పన్నాగమని బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో ఎవరిది దొంగాట ? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మోడీ మెడలు వంచైనా ... గద్దె దింపైనా సాధిస్తాం : కాంగ్రెస్ 

నాలుగు నెల్ల క్రితం తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసింది. ఆ తర్వాత, ఆ బిల్లులను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే, అవి ఇంకా ఆమోదం పొంద లేదు. దీంతో ఇప్పటి వరకు బిల్లుల ఆమోదం కోసం ఎదురు చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పోరు బాట పట్టారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన జరిపారు. "మోడీ మెడలు వంచైనా లేదా మోడీని గద్దె దించైనా" బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా శపథం చేశారు. కేంద్రం కావాలనే ఈ బిల్లులను ఆమోదించకుండా ఆలస్యం చేస్తుందని ఆరోపించారు.

ముస్లిం రిజర్వేషన్లను మేం ఒప్పుకోం : బీజేపీ 

అయితే, కాంగ్రెస్ నాయకుల వాదనకు భిన్నంగా తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఈ బిల్లులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బీసీ రిజర్వేషన్ల బిల్లు కాదని, ఇందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. ఈ బిల్లులో ముస్లిం రిజర్వేషన్లు తొలగించి, ఆ మొత్తాన్ని బీసీలకే కేటాయిస్తే, కేంద్రం ఆమోదిస్తుందని స్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. అయితే, బిల్లులో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కాదని, ముస్లిం కమ్యూనిటీలో బీసీలుగా పరిగణించబడే దూదేకుల కులం వారికి మాత్రమేనని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ,ఈ అంశం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు దారి తీసింది.

హైకోర్టు ఆదేశాలు ... ఆర్డినెన్స్ ప్రతిష్టంభన

Local body Elections

ఈ రాజకీయ రగడ జరుగుతుండగానే, సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్రం ఆమోదం లభిస్తేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి, ఎన్నికలు నిర్వహించడానికి వీలు కలుగుతుంది. లేక పోతే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో అమలు చేయడం కుదరక పోవొచ్చు. బిల్లులు పంపి నాలుగు నెల్లైనా కేంద్రం నుండి స్పందన లేక పోవడంతో, తెలంగాణ ప్రభుత్వం మరో మార్గంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ఇటీవల ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు. కానీ, ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకుండా, సలహా కోసం కేంద్ర హోం శాఖకు పంపారు. దీంతో ఈ ఆర్డినెన్స్ కూడా పెండింగ్‌లో పడి పోయింది.ఈ పరిణామాల నేపథ్యంలో, సెప్టెంబర్ 30 లోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు.

ఈ రాజకీయ పోరులో బిల్లులు, ఆర్డినెన్స్ ఆమోదం పొందకుండా నిలిచి పోయాయి. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ వివాదంలో ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నది తేలాల్సి వుంది.  

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి