భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం ... 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ఉధృతి

Godavari River, Bhadrachalam

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 53 అడుగులకు చేరువలో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఈ సాయంత్రం 5 గంటల వరకు 51.90 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం 13, 66, 298 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద రావడంతో అధికార్లు నదీ పరీవాహక ప్రాంత  ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ ఏడాది గోదావరికి ఇంత వరద రావడం ఇదే మొదటి సారి. దీంతో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షించి, అధికార్లకు తగిన సూచనలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ తో ఫోన్లో మాట్లాడి ఎగువ నుండి వరద ఎక్కువగా వుండడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, భద్రాచలంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రామాలయం టెంపుల్ వద్ద గల కరకట్ట, స్లూయిస్ కాలువ, కునవరం రోడ్లో నూతన కరకట్ట ప్రాంతాల్లో పర్యటించి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, గోదావరి వరద నీరు పట్టణంలోకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

Collector Jithesh, SP Rohith Raj

పలు ప్రాంతాల్లో రోడ్లపైకి గోదావరి ... రాక పోకలు బంద్

మరో వైపు ఇప్పటికే సారపాక ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరింది. అశ్వాపురం మండలంలోని కడియాల బుడ్డి వాగు వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్థానిక సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం వెళ్ళేవారు రామచంద్రపురం, ఇరవెండి మీదుగా రావద్దని, మొండికుంట క్రాస్ రోడ్ వైపు ప్రయాణం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఏర్పడితే 100 కి కాల్ చెయ్యాలని కోరారు. మండలంలోని నెల్లిపాక బంజర వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. తహశీల్దార్  మణిధర్ గ్రామంలో పర్యటించి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, వరద నీరు పెరుగుతున్న నేపధ్యంలో పశువులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ఉధృతి పెరిగే ఎక్కువతే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరారు. మణుగూరు మండలంలోని కమలాపురం శివారు ప్రాంతానికి గోదావరి నీరు చేరడంతో మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్, సీఐ నాగబాబు, ఎస్సై రంజిత్ పరిశీలించారు. చిన్న రావి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పుష్కర ఘాట్ల పైకి గోదావరి వరద రావడంతో పాముల పల్లి వెళ్లే దారిలో రాక పోకలు బందయ్యాయి. అలాగే, భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్ళే రహదారిపై కూడా రవాణా నిలిచి పోయింది. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక డైవర్షన్ రోడ్డు, పర్ణశాల రహదారిపైకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బూర్గం పాడు మండలంలో పంట పొలాలు నీట మునిగాయి.

Godavari River

నిండు కుండలా జలాశయాలు

ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలోని జలాశయాలు నిండు కుండలా మారాయి. పాలేరు జలాశయానికి 2.377 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీని గరిష్ట నీటి మట్టం 23 అడుగులు కాగా 22 అడుగుల వద్ద తగ్గు ముఖం పడుతోంది. అలాగే వైరా రిజర్వాయర్ కు 2.523 టీఎంసీల నీరు వచ్చింది. ఈ రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 18.3 అడుగులు కాగా, ప్రస్తుతం 18.09 అడుగుల మేర నీరుంది. లంకా సాగర్ ప్రాజెక్టుకు కూడా నీరు పోటెత్తింది. జలాశయంలో 0.628 టీఎంసీల నీరు చేరింది. దీని గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం16  అడుగులు కాగా15.05 అడుగుల మేర నీరు నిల్వ వుంది. అదే విధంగా జిల్లాలోని 1061 చెరువులకు గాను 317 చెరువులు పొంగి పొర్లుతున్నాయి. 325 చెరువులు 90 నుండి 100 శాతం, 201 చెరువులు 75 ను నుండి 90 శాతం, 121 చెరువులు 50 నుండి 75 శాతం, 72 చెరువులు 25 నుండి 50 శాతం, 25 చెరువులు 0 నుండి 25 శాతం నిండాయి.

Paleru Reservoir, Khammam

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే