కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణానికి డిజైన్లు రెడీ
కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నిర్మించేందుకు డిజైన్లు
రెడీ అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదంతో త్వరలో నిర్మాణ పనులు కూడా
ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. ప్రముఖ ఆర్కిటెక్ ఉష రూపొందించిన
యూనివర్సిటీ నిర్మాణ నమూనాలను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర
రావు సచివాలయంలోని తన చాంబర్లో యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ యోగితా రాణా, ఇతర అధికారులతో కలిసి
పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతంగా ఈ యూనివర్సిటీ ప్రణాళికను రూపొందించాలని అధికార్లను ఆదేశించారు. ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణంగా ఇది
నిలిచి పోవాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని మౌళిక సదుపాయాలతో ఈ యూనివర్సిటీని
నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఎక్కడా లోటుపాట్లు
లేకుండా నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం జరగాలన్నారు. విద్యార్థులు, లెక్చరర్లకు అసౌకర్యం కలగకుండా
విశాలమైన తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలను
నిర్మించాలన్నారు. ఆర్కిటెక్ తయారు చేసిన డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించి, ఆయన ఆదేశాలకు
అనుగుణంగా డిజైన్లకు ఆమోదం తీసుకోవాలని అధికార్లకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన
వెంటనే ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

.jpeg)
Comments
Post a Comment