గిరిజనుల హక్కులు, ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం

 

Mallu Bhatti Vikramarka

  • సంక్షేమ పథకాలపై కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయాలి
  • త్వరలో లబ్దిదారుల జాబితాలు గ్రామాలకు పంపుతాం  
  • ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 17,169 కోట్లు కేటాయించాం
  • గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఫారెస్ట్ రైట్స్ యాక్టు తెచ్చాం
  • పోడు రైతులకు 6.70 లక్షల ఎకరాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే
  • వాటిని ఇందిరా సౌర గిరి జల వికాసంతో అభివృద్ధి చేస్తోంది మేమే
  • గిరిజన సమ్మేళనంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

గిరిజనుల హక్కులు, ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. ఆత్మగౌరవం, సమ సమాజం స్థాపన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, అందుకు అనుగుణంగానే పథకాలను ప్రవేశ పెట్టామని చెప్పారు. శనివారం ఆయన పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో మూడు రోజులుగా జరుగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనం ( శిక్షణా తరగతులు ) లో ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని భట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఊరూరా ... ఇంటింటికీ ఈ ప్రచారం చేరాలన్నారు. త్వరలో ఏ ఇంటికి ఏ పథకాలు అందుతున్నాయి ... ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో పూర్తి వివరాలతో జాబితాలను గ్రామాలకు పంపుతామని చెప్పారు. పథకాలకు అర్హులైన వారితో ధరఖాస్తులు చేయించాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ ఏడాది ప్రతి నియోజక వర్గంలో 3, 500  ఇందిరమ్మ ఇళ్ళునిర్మిస్తున్నామని, మొత్తం 4.50 లక్షల ఇళ్ళకు గాను రూ. 22, 500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 90 లక్షల కుటుంబాలకు రూ. 13, 500 కోట్లతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలను విజయ వంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అంతే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల వల్ల ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదలకు మేలు జరుగుతుందన్నారు. 

 గత ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయ లేదు

 గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఈ వర్గాలకు ఆత్మ గౌరవం దక్కక పోగా, నిధులు కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి దోహద పడేలా సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 17,169 కోట్లు కేటాయించామని, గతంలో ఖర్చు చేయని 1,296  కోట్ల నిధులను కూడా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఈ నిధులను ఖర్చు చేయగలిగితే, ఆయా వర్గాల జీవన ప్రమాణాలు మెరుగు పడటమే కాకుండా, వారికి సంతృప్తి కూడా కలుగుతుందన్నారు. అలాగే, రాజీవ్ యువ వికాసంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఓ రికార్డని భట్టి పేర్కొన్నారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం దళిత, గిరిజనుల భూములను హస్త గతం చేసుకుంటుంటే, తిరిగి హక్కులు కల్పించేందుకు ధరణిని బంగాళాఖాతంలో వేసి, భూభారతి తెచ్చామన్నారు.  అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు నల్లమల్ల డిక్లరేషన్ తీసుకొచ్చి, ఇందిరా సౌర గిరి జల వికాసం అమలు చేస్తున్నామని చెప్పారు. ఫారెస్ట్ రైట్స్ యాక్టు ద్వారా పొందిన 6.70 లక్షల ఎకరాలకు రూ. 12,500  కోట్లు ఖర్చు చేసి సాగులోకి తీసుకు వస్తున్నామన్నారు. ఈ పథకం కింద గిరిజన రైతులకు బోర్లు వేయడంతో పాటు సోలార్ పంపు సెట్లు, , డ్రిప్స్, స్ప్రింక్లర్లు అందిస్తామని తెలిపారు. అంతే కాకుండా సాగుకు అవసరమైన ఫామాయిల్, మామిడి వంటి లాభసాటి మొక్కలను కూడా ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పోడు చేస్తున్న గిరిజన మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టి భయభ్రాంతులకు గురి చేస్తే, తాము పోడు భూముల్లో లాభసాటి పంటల సాగుకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్టు ద్వారానే గిరిజనులకు 6.70 లక్షల ఎకరాల పోడు భూములు దక్కాయని భట్టి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిరిజన సమ్మేళనంలో భాగంగా శనివారం జరిగిన శిక్షణా తరగతుల్లో కాంగ్రెస్ జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగం కన్వీనర్ కొప్పుల రాజు, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మేల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్ ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ పొదెం వీరయ్య, గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే