వైరా బ్రిడ్జిపై ఘోర ప్రమాదం ... ఆరుగురికి గాయాలు

 

Road accident

వైరా నది హై లెవెల్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్ట వశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగ లేదు. స్థానికుల కధనం ప్రకారం, మొదట తల్లాడ వైపు 20 ఎంఎం ఇనుప రాడ్ల లోడ్ తో వెళుతున్న లారీ, ఎదురుగా కొబ్బరి బోండాల లోడుతో వస్తున్న వ్యాన్ ను బ్రిడ్జిపై ఢీకొట్టింది. కానీ, బ్రిడ్జి గైడ్ రైల్స్ కు తగిలి వ్యాన్ బ్రిడ్జి క్రింద పడకుండా ఆగి పోయింది. ఆ వెంటనే, అదే లారీ విస్సన్న పేట మండలంలోని తెల్ల దేవర పల్లి నుండి వైరా మండలంలోని రెబ్బవరం గ్రామానికి వెళుతున్న కారును ఆ బ్రిడ్జిపైనే ఢీకొట్టింది. దీంతో లారీ, కారు బ్రిడ్జిపై నుండి 50 అడుగుల లోతులోని వైరా నదిలో పడి పోయాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న మొగిలి శెట్టి రాజశేఖర్, అతని భార్య గీత, కూతురు జ్యోత్స్న, కుమారుడు తేజెస్లకు స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ కూడా స్వల్పంగా గాయ పడ్డాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయినప్పటికీ, మున్సిపాలిటీ డంపు చేసిన చెత్తలో కూరుకు పోవడంతో అందులో ప్రయాణిస్తున్న మొగిలి శెట్టి రాజశేఖర్ కుటుంబం స్వల్ప గాయాలతో బయట పడింది, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రామారావు, క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే