వ్యవసాయాన్ని మార్చి పోతే అస్తిత్వాన్ని కోల్పోతాం
- ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
వ్యవసాయాన్ని మరిచి పోతే మన అస్తిత్వం కోల్పోతామని ఖమ్మం జిల్లా కలెక్టర్
ముజమ్మిల్ ఖాన్ అన్నారు. అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలు మాత్రమే కాదని, మనమంతా వ్యవసాయ
కుటుంబాల నుంచి వచ్చామన్న సంగతి మార్చి పోవొద్దని చెప్పారు. గురువారం ఆయన తల్లాడ
మండలం కుర్నవల్లి గ్రామంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయవిశ్వవిధాలయం, వైరా
కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్నారు. ముందుగా
గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా నాలుగో సంవత్సరం చదువుతున్న
వ్యవసాయ విద్యార్థులు, నూతన సాగు విధానంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను
ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వ్యవసాయం ఉంటేనే
మనకు ఆహార భద్రత ఉంటుందని, 50 సంవత్సరాల క్రితం దేశంలో ఆహార సంక్షోభం ఉండేదని, ఇతర దేశాలు అందించే
ధాన్యంపై ఆధార పడ్డామని తెలిపారు. వ్యవసాయ విప్లవం తర్వాత దేశం ఆహార స్వావలంభన
సాధించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆహార సంక్షోభ ప్రమాదం వచ్చినప్పుడు ఆధునిక
పద్ధతులలో వ్యవసాయంపై దృష్టి సారించి, ప్రస్తుతం దేశ అవసరాలకు మించి పండించే స్థాయికి
చేరుకున్నామని అన్నారు. వ్యవసాయ విద్యార్థులు రాబోయే రోజుల్లో రైతులకు మరిన్ని
సేవలు చేయాలని, అన్నదాత
అభివృద్ధి కోసం అహర్నిశలు కష్ట పడాలని సూచించారు. విద్యార్థులు రైతులతో మమేకమై
క్రొత్త సాగు పద్ధతులు పాటించేలా, దిగుబడి పెంచి నికర ఆదాయం వచ్చే విధంగా ఎప్పుడూ సలహాలు
సూచనలు ఇవ్వాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి, వాళ్ళ కష్ట సుఖాలు
తెలుసుకొని, మెరుగైన
సేవలు అందించాలని, ఆధునికతను
రైతుల వరకు చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం వైరా ప్రోగ్రాం
కోఆర్డినేటర్ డా. కే. రవి కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, డా. జె. హేమంత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి , తల్లాడ మండల తహసీల్డార్ సురేశ్ కుమార్, వ్యవసాయ అధికారి తాజుద్దీన్, విస్తరణ అధికారి త్రివేణి, డా. మధుసూదన్ రెడ్డి, డా. ఝాన్సీ, డా. శ్రవణ్, శాస్త్రవేత్త ఫణిశ్రీ తదితరులు
పాల్గొన్నారు.

Comments
Post a Comment