ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం

SFI


  • సంఘం ద్వారా దేశానికి ఎంతో మంది నిష్ణాతులు
  • లౌకిక తత్వంపై మాట్లాడితే యూనివర్సిటీల నుంచి సస్పెన్షన్
  • ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్
  • ముగిసిన ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట్ర మహాసభలు
  • 17 అంశాలపై తీర్మానాలు, నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం లాంటిదని ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్ అన్నారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం పునాదులపై ఇది నిర్మితమైందన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం ( సీతారాం ఏచూరి నగర్ )లో మూడు రోజులు పాటు కొనసాగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు నితీష్ నారాయణ్ మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని,సెక్యులరిజంపై మాట్లాడినందుకు స్కాలర్స్ ను యూనివర్సిటీల నుంచి బహిష్కరిస్తోందని అన్నారు. విద్యార్థి సమస్యలపై ప్రశ్నించినందుకు విద్యార్థి నేతలపై దేశద్రోహం కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. లౌకిక విధానంపై మాట్లాడినందుకు టీఐఎస్ఎస్ రీసెర్చ్ స్కాలర్ రాందాస్ పై రెండేళ్లు వేటు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ హెచ్ సీయూ భూముల కాజేస్తున్నారని విమర్శించారు. ఎలా జీవించాలో ఎలాంటి వర్గ దృక్పథం కలిగి ఉండాలో ఎస్ఎఫ్ఐ నేర్పుతోందన్నారు. ధనిక, ఫ్యూడల్ భావ జాలానికి వ్యతిరేకంగా శ్రమ జీవుల పక్షాన ఈ సంఘం నిలబడుతుందన్నారు. ఎస్ఎఫ్ఐ దేశానికి ఎంతోమంది నిష్ణాతులను ఇచ్చిందని తెలిపారు.  జై భీమ్ చిత్ర ఇతి వృత్తానికి సంబంధించిన జస్టిస్ చంద్రు ఎస్ఎఫ్ఐకి చెందిన వారే కావడం గర్వకారణం అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ ఎన్. రామ్ ఎస్ఎఫ్ఐ మొట్ట మొదటి జాతీయ అధ్యక్షుడని తెలిపారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం దిశగా విద్యార్థుల దృక్పథం ఉండేలా ఎస్ఎఫ్ఐ కృషి సల్పాలన్నారు. త్యాగధనులు పుట్టిన గడ్డ ఖమ్మంలో మహాసభలు జరగడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. భూ పోరాట యోధుల గడ్డ ముదిగొండ అని, ఖమ్మం చుట్టూ ఉద్యమాల చరిత్రే అల్లుకొని ఉందన్నారు. సభలో జాతీయ అధ్యక్షులు వీపీ సాను, రాష్ట్ర మాజీ అధ్యక్షులు కోయ చంద్రమోహన్, కేవీపీఎస్  రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సీఐటీయూ నాయకులు కల్లూరు మల్లేష్, ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు నాగేశ్వర రావు సౌహార్థ సందేశాలిచ్చారు. మహాసభలో మొత్తం 17 తీర్మానాలను ఆమోదించారు. చివరగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట్ర మహాసభ మొత్తం 17 తీర్మానాలను ఆమోదించింది. నూతన జాతీయ విద్యావిధానం-2020 రద్దు చేయాలని,  విద్యార్ధి సంఘ ఎన్నికలు నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి రెగ్యులర్ గా ఇవ్వాలని తీర్మానించారు.  

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్, నాగరాజు

  • 61 మందితో నూతన కమిటీ
  • 15 మందితో కార్యదర్శి వర్గం

ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో ఆదివారం ముగిశాయి. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రం సీతారాం ఏచూరి నగర్ లో మూడు రోజులపాటు నిర్వహించిన మహాసభల్లో రాబోయే రెండున్నర సంవత్సరాల కోసం 61 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్ (కరీంనగర్), టి. నాగరాజు (ఖమ్మం) ఎన్నికయ్యారు. వీరితో కలిపి మొత్తం 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా ఏడుగురు, సహాయ కార్యదర్శులుగా ఆరుగురు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అశోక్, పూజ, కిరణ్ (హైదరాబాదు), శంకర్ (రంగారెడ్డి), శ్రీకాంత్ (కరీంనగర్), శ్రీకాంత్ వర్మ (సూర్యాపేట), ప్రశాంత్ (మహబూబ్‌నగర్) ఉన్నారు. సహాయ కార్యదర్శులుగా యార ప్రశాంత్ (వరంగల్), శంకర్ (నల్గొండ), రంజిత్ రెడ్డి (సిద్ధిపేట), దీపిక, మమత, ఆదిక్ (హైదరాబాదు) ఎన్నికయ్యారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు