కేంద్రం ముస్లింల హక్కులను కాల రాసింది
- వెంటనే వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి
- ఆర్పీవీ అధ్యక్షులు సాధిక్ అలి డిమాండ్
- ఖమ్మంలో ఆర్పీవీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025
ను తీసుకు వచ్చి ముస్లింల హక్కులను కాల రాసిందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాధిక్ అలి విమర్శించారు. ఆల్ ఇండియా ముస్లిం
పర్సనల్ లా బోర్డ్ చేపట్టినకార్యక్రమాలకు
మద్దతుగా ఖమ్మంలో బుధవారం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నిర్వహించారు. వరంగల్ క్రాస్ రోడ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కాల్వ ఒడ్డు, మయూరిసెంటర్, పాత ఎల్ఐసి ఆఫీస్ మీదుగా జడ్పీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకూ సాగింది.
అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి, ప్ల కార్డులు పట్టుకొని వక్ఫ్
సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాధిక్ అలి మాట్లాడుతూ ముస్లిం
మైనార్టీల పట్ల వివక్షత చూపడంతో పాటు విభజించి పాలించే నైజాన్ని కేంద్ర ప్రభుత్వం
అనేక ఏళ్లుగా ప్రదర్శిస్తూ వస్తుందన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన నల్ల చట్టాలను
తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మతేతర రాజ్యంలో మంటలు రేపుతూ, ప్రతి నిత్యం మతాల
మధ్య చిచ్చు పెడుతూ,
విద్వేషాలను రెచ్చగొడుతూ కేంద్ర ప్రభుత్వం
కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి
ముస్లిం మైనార్టీల పట్ల చిన్నచూపు చూస్తూ పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. ముస్లిం
మైనార్టీల హక్కుల సాధన కోసం, నల్ల చట్టాల రద్దు కోసం ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి
ప్రారంభమైన ఈ ఆందోళన రాబోవు రోజుల్లో దేశ రాజధాని హస్తినలో గల జంతర్ మంతర్ ను ముట్టడించే
వరకు సాగుతుందన్నారు. వక్ఫ్ భూములు ఏ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవి
కావని,
స్వాతంత్ర్యానికి
ముందు, ఆనాటి రాజులు దేవుడు
మాన్యాలు, పీర్ల
చావిడి,
దర్గా, మసీదు నిర్మాణాల కోసం
ఇచ్చిన భూములను లాక్కునే హక్కు కానీ, అందులో చైర్మన్, సభ్యుల పేర్లతో రంగ ప్రవేశం
చేసే హక్కు కానీ ఏ ఒక్కరికి లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను
విరమించుకోవాలని, వక్ఫ్
సవరణ చట్టం 2025ను తక్షణమే రద్దు చేయాలని
డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్త
ఉద్యమాలను గాంధేయ మార్గంలో చేపడతామని సాధిక్
అలి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ నజీర్. హుస్సేన్, ఇబ్రహీం, సోను, యాకూబ్ పాషా, కుమార్, ఆరిఫ్ తండా, హుసేన్, అన్వర్, అబ్దుల్, షాహిద్, షరీఫ్, మోను, కాసిం, కాజల్, భాష, మదర్, రంజాన్, ఇబ్రహీం, ఇఫ్తి కార్, ఆసిఫ్, అఫ్సర్ తదితరులు
పాల్గొన్నారు.
Comments
Post a Comment