ఆ పదవి బట్టికే ... దక్కే అవకాశమెంత ?


పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం టి.‌పి.‌సి.‌సి నూతన అధ్యక్షుణ్ణి నియమించే అవకాశంవుంది. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ పదవిని  ఎవరికిస్తే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పి‌సి‌సి అధ్యక్షుడిగా వున్న సి‌ఎం రేవంత్ రెడ్డి ఇక పాలనపై పూర్తి స్థాయిలో ధృష్టి పెట్టేందుకు వీలుగా వెంటనే కొత్త చీఫ్ ను నియమించాలన్న ఆలోచనలో పార్టీ పెద్దలున్నారు. అయితే ... రేవంత్ రెడ్డికి సహకరిస్తూ పార్టీని సమర్ధవంతంగా నడపగలిగే వారి కోసం వెదుకుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో ... ఈ పదవి కోసం అరడజను మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా  ప్రస్తుత డిప్యూటీ సీ‌ఎంగా వున్న మల్లు బట్టి విక్రమార్క ఈ పదవిని తనకు ఇవ్వాలని చాలా కాలంగా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కడికే జోడు పదవులు ఇచ్చే అవకాశం లేదని కొందరు అంటుంటే ... కర్నాటక డిప్యూటీ సీ‌ఎంగా వున్న డీకే శివ కుమార్ ఆ రాష్ట్ర పి‌సి‌సి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో ... తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం బట్టికే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముందని మరికొందరంటున్నారు.

కానీ ... పార్టీలో ... నామినేటెడ్ పోస్టుల భర్తీలో ... పార్లమెంట్ అభ్యర్ధుల ఎంపికలో ఇక్కడ బీసీలు, ముస్లింలు, మాదిగ సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దొరక లేదని ఆయా వర్గాలు అసంతృప్తితో వున్నాయి. ఈ పదవినైనా తమకు ఇవ్వాలని ఆ వర్గాల పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. బీసీ నేతలు ... టి‌పి‌సి‌సి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎం‌ఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎం‌పి మధుయాష్కి గౌడ్ ఈ రేసులో వున్నారు. ఏ.ఐ. సి.‌సి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా ఈ పదవి తనకు వస్తుందన్న నమ్మకంతో వున్నారు. సంపత్ కుమార్ మొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ టిక్కెట్ అడిగినప్పటికీ ఇవ్వలేదు. దీంతో మాదిగ సామాజిక వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందన్న ప్రచారం జరిగింది. అందువల్ల ఎస్సీల్లో అధిక సంఖ్యాకులైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ ను పి‌సి‌సి చీఫ్ గా ఎంపిక చేసే అవకాశం వుందంటున్నారు. ఇదిలా వుండగా ... పి‌సి‌సి మరో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి, ఎం‌ఎల్‌ఏ కోమటి రెడ్డి రాజా గోపాల్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే ... రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి సి‌ఎంగా వుండటం వల్ల అదే సామాజిక వర్గానికి చెందిన వారిని పి.‌సి.‌సి చీఫ్ గా నియమించే అవకాశం లేదంటున్నారు. బట్టి, మహేశ్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ల మధ్యే పోటీ వున్నట్లు తెలుస్తోంది. మరి కర్ణాటక లాగా డిప్యూటీ సి‌ఎం బట్టికే పార్టీ పగ్గాలు అప్పగిస్తారో  ? మరో బీసీనో ఎఎస్సీనో నియమిస్తారో చూడాలి.   

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు