వరదల నుండి రక్షించేందుకు 5 డీడీఆర్ఎఫ్ బృందాలు
- ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాయి
- విపత్కర పరిస్థితుల్లో 100 కు కాల్ చేయండి
- భద్రాద్రి కొత్తగూడెంఎస్పీ రోహిత్ రాజు
వరదల్లో ప్రమాద వశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా
పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 డీడీఆర్ఎఫ్ బృందాలు నిత్యం ప్రజలకు అందుబాటులో
ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. అత్యవసర
సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామని
తెలిపారు. గురువారం ఆయన జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, 6వ బెటాలియన్ టీజీఎస్పి
అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జిల్లాలో
ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్ఎఫ్
బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు నదీ పరివాహక
ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలను రక్షించడానికి ఈ బృందాలు ఎల్ల వేళలా
అందుబాటులో వుంటాయన్నారు. రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్, లైఫ్ బాయ్ రింగ్స్, బోట్ పెడల్స్, రోప్స్, ఇతర సామాగ్రి
మొత్తాన్ని ఈ బృందాలకు సమకూర్చడం జరిగిందన్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎలాంటి
విపత్తు ఎదురైనా అక్కడి బాధితులను రక్షించేందుకు సమన్వయంతో అన్ని శాఖల అధికారులు
బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత
ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. విపత్కర సమయాల్లో డయల్ 100 కు
ఫోన్ చేసి,
పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ( ఆపరేషన్స్ )
నరేందర్,
జిల్లా
అగ్నిమాపక శాఖాధికారి క్రాంతి కుమార్, 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆపరేషన్స్ ఆర్ఐ రవి తదితరులు
పాల్గొన్నారు.


Comments
Post a Comment