మత్కేపల్లి మార్కెట్ యార్డుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- చింతకాని, ముదిగొండ మండలాలతో కలిపి మార్కెట్ యార్డు ఏర్పాటు
- ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
మధిర నియోజక వర్గంలోని మథ్కేపల్లిలో మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం
గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వున్న ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, నేలకొండపల్లి మార్కేట్
యార్డులను విభజించి కొత్తగా ఈ మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా చింతకాని, ముదిగొండ మండలాలను కలిపి మత్కేపల్లి మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తారు. ఈ మార్కెట్
యార్డ్ ఏర్పాటుకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రత్యేక చొరవ
తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ ప్రాంతంలో
మార్కెట్ యార్డు సదుపాయం లేనందు వల్ల, మొక్కజొన్న, పత్తి, ఇతర పంటలను రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకునే వారని, కాని ఇప్పుడు మత్కేపల్లి
మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడం వల్ల రైతులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే
అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే, ఖమ్మం, నేలకొండపల్లి మార్కెట్
యార్డులకు పోయే అవసరం తప్పుతుందన్నారు. దూరం తగ్గి పోవడం వల్ల రైతులు తమ
ఉత్పత్తులు అమ్ముకోవడానికి దళారుల వద్దకు వెళ్లడం తగ్గడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా
తప్పుతాయని తెలిపారు. ఈ మార్కెట్ యార్డులో రైతులకు కావాల్సిన అన్ని మౌళిక
సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొక్క జొన్న, పత్తి రైతులు గరిష్ట మద్దతు ధరకు
తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు కలుగుతుందని, రైతులు మంచి ఆదాయం పొందే
అవకాశం వుందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు.
.jpeg)
Comments
Post a Comment