భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఆక్రమణలు తొలగించండి
- ధంసలాపురం, పుట్ట కోట చెరువుల వద్ద మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం
- ఖమ్మం భూగర్భ డ్రైనేజ్ నిర్మాణ పనుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం నగరంలో మురుగు నీటి కాల్వల నిర్మాణానికి అడ్డుగా ఉన్న అక్రమ
నిర్మాణాల తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ అధికార్లను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, నీటి పారుదల శాఖ అధికారులు
సంయుక్తంగా క్షేత్ర స్థాయి పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్లోని
కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం మురుగు నీటి పైప్ లైన్ భూగర్భ డ్రైనేజ్ నిర్మాణ పనులపై
సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ
నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు ఆశించిన స్థాయిలో జరగక పోవడం
పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం సమగ్ర ప్రణాళిక
తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధంసలాపురం చెరువు వద్ద 44 ఎం.ఎల్.డి సామర్థ్యంతో, పుట్టకోట చెరువు వద్ద
9.5 ఎం.ఎల్.డి సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరుగుతుందన్నారు. ఖమ్మం నగరంలో 249.5 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ పనులను అమృత్ 2 పథకం క్రింద
మంజూరు చేసుకోవడం జరిగిందని, వీటిలో 189 కోట్ల 50 లక్షల రూపాయలు భూగర్భ డ్రైనేజ్
వ్యవస్థ నిర్మాణం, 60
కోట్ల రూపాయలు రాబోయే 10 సంవత్సరాల్లో వాటి నిర్వహణకు కేటాయించడం జరిగిందని
తెలిపారు. 8.5 కిలోమీటర్ల డ్రైనేజ్ కు గాను 1.54 కిలో మీటర్లు, 432 మ్యాన్ హోల్స్
నిర్మాణానికి గాను 73 మ్యాన్ హోల్స్ నిర్మాణం పూర్తి చేశారని అన్నారు. మురుగు నీటి
కాల్వ 2.5 కిలో మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాల తొలగింపు లేకుండా పూర్తి చేయవచ్చని, 1.5 కిలో మీటర్ వరకు
ప్రస్తుతం పూర్తయిందని, పెండింగ్ పనులకు అదనపు బృందాలు ఏర్పాటు చేసి పూర్తి
చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, డిఇ, ఏఇలు పాల్గొన్నారు.

Comments
Post a Comment