ధరణిలా స్వార్ధంతో తెచ్చిన చట్టం కాదు ‘ భూ భారతి ’
- భూ సమస్యల పరిష్కారానికి ఐదంచేల వ్యవస్థ
- రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు
- సీసీఎల్ఎలో పరిష్కారం కాక పోతే ట్రిబ్యునల్స్ కు వెళ్లొచ్చు
- గులాబి రంగు కార్యకర్తలకు భూమి లేక పోయినా పాస్ పుస్తకాలిచ్చారు
- సక్రమం కాని అక్రమాలపై చర్యలు తప్పవు
- భూ భారతిలో అన్ని సమస్యలకు శాశ్విత పరిష్కారం
- రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భూ భారతి చట్టంలో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ధరణిలా ఇది నాలుగు
గోడల మధ్య తెచ్చిన స్వార్ధ పూరిత చట్టం కాదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట
మండలం శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో
నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ చట్టం చేసే ముందు
రైతుల కష్టం గురించి ఆలోచించి, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ సూచనలను
పరిగణనలోకి తీసుకొని రైతులకు శ్రీరామరక్షగా నిలిచే భూ భారతి -2025 చట్టాన్ని
రూపొందించామని తెలిపారు. గతంలో నాలుగు
గోడల మధ్య స్వార్ధ పూరితంగా తయారు చేసిన ధరణి చట్టానికి మూడేళ్లు గడిచినా నియమ
నిబంధనలు రూపొందించ లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాల్లో
తొలి విడత ప్రయోగాత్మకంగా అమలు చేసి అన్ని వివరాలు, దరఖాస్తులు సేకరిస్తున్నామని, జూన్ 2 నాటికి వీలైనన్ని సమస్యలు
పరిష్కరించి , అర్హులైన
వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పట్టాలుగా అందజేస్తామని తెలిపారు.
ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో నేలకొండ పల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద
ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. భూ యజమానులకు న్యాయం జరిగేలా తహశీల్దార్ మొదలు
కొని సీసీఎల్ఎ వరకు ఐదంచెల వ్యవస్దను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
సీసీఎల్ఎ వద్ద కూడా న్యాయం జరగ లేదని భావిస్తే ట్రిబ్యునల్ ను
ఆశ్రయించవచ్చన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనన్ని ట్రిబ్యునల్స్
ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చేనెల 10వ తేదీ కల్లా రెవెన్యూ, గ్రామ పరిపాలనాధికారులు
ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తప్పు చేసే
అధికారులపై చర్యలకు వెనుకాడ బోమని స్పష్టం చేశారు. గతంలో రైతు బంధు కోసం
గులాబీ రంగు కార్యకర్తలకు భూమి లేక పోయినా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని, సక్రమం కాని అటువంటి అక్రమాలపై చర్యలు తప్పవని
హెచ్చరించారు. రైతులకు మరిన్ని సేవలు అందేలా రెవెన్యూ వ్యవస్థ పని చేస్తుందని ఏ
పార్టీ కార్యకర్త అనే పక్ష పాతం లేకుండా ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు చట్టం ఒక
చుట్టంలా ఉపయోగపడేలా చూస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ
సదస్సులో అశ్వరావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి
పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్
తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment