అన్నం మెతుకులపై కులాన్ని అంటించి రాజకీయ లబ్ధి
- కుల మత కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొనడం నేరం
- మాస్ లైన్ జన బోజనాల్లో రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
కుల మత కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొనటం నేరమని సీపీఐ( ఎంఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. అన్నం మెతుకులపై కులాన్ని అంటించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుల భోజనాలను ఏర్పాటు చేస్తున్నారని, రాజ్యాంగం పై ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు కులమత కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించేందుకు సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో కుల మతాతీత జాన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాల పేరుతో ప్రజలను వాడుకొని విభజిస్తున్నారని విమర్శించారు. విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య మాట్లాడుతూ కుల మతాలు మధ్య వైరుధ్యాలను పెంచి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా అశేష ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. మాజీ మావోయిస్టు జంపన్న మాట్లాడుతూ కుల భోజనాలకు పోవడాన్ని చాలా మంది గొప్పగా భావిస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వాదులపై ఉందన్నారు. స్పర్శ అధ్యయన వేదిక బాధ్యులు స్పర్శ భాస్కర్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం తెలంగాణ ప్రజానీకం ఖమ్మం గుమ్మం వైపు చూస్తోందని, ఈ సాంస్కృతిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ జన భోజనాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కళాకారులు ఆడి పాడి ఆలోచింపజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, సివై పుల్లయ్య, అశోక్, సిహెచ్ శిరోమణి, ఝాన్సీ, కొల్లేటి నాగేశ్వరరావు, శోభ, కే శ్రీనివాస్, తేజ, రాకేష్, మంగతాయ్, లక్ష్మణ్, హనుమంత రావు, ఆజాద్, వెంకటేష్, లక్ష్మణ్, బల్లెపల్లి వెంకటేశ్వర్లు, ధరణి, కృష్ణ, లెనిన్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment